గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు
ఐదుగురు మృతి, 84 మంది గల్లంతు
మనీలా: ఫిలిప్పీన్స్లో మనీలా నుండి పశ్చిమ పలవాన్ ప్రావిన్స్కు వెళ్తున్న ఒక ప్రయాణికుల ఫెర్రీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 84 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. 117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక బుధవారం రాత్రి కొరోన్ తీరానికి చేరుకునే క్రమంలో వరుస పేలుళ్లతో మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగ, తీవ్రమైన వేడి కారణంగా శుక్రవారానికే అగ్నిమాపక సిబ్బంది కాలిన ఫెర్రీ లోపలికి ప్రవేశించగలిగారు.
ఈ ప్రమాదం నుండి ఇప్పటివరకు 43 మందిని సురక్షితంగా రక్షించగా, సముద్రంలో గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్లు, డైవర్లు మరియు స్థానిక మత్స్యకారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నౌకలోని సరుకు రవాణా విభాగంలో జరిగిన పేలుళ్లే ప్రమాదానికి కారణమని భావిస్తుండగా, సముద్ర రవాణా సంస్థ (MARINA) సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు, తమ ప్రియమైన వారి సమాచారం కోసం గల్లంతైన వారి బంధువులు ఫెర్రీ యాజమాన్య కార్యాలయం వద్ద ఆందోళన చెందుతున్నారు. 7,600 కంటే ఎక్కువ ద్వీపాలున్న ఫిలిప్పీన్స్లో తరచూ ఇలాంటి ఫెర్రీ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.