మత్స్య రంగానికి మహర్దశ
ఆరేళ్లు పూర్తి చేసుకున్న ‘పీఎంఎంఎస్వై’
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) 2026 సెప్టెంబర్ 10 నాటికి విజయవంతంగా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, నూతన సాంకేతికత మరియు సుస్థిర వృద్ధికి ప్రాధాన్యమిస్తూ రూ. 20,750 కోట్ల అంచనా వ్యయంతో 2020లో ప్రారంభమైన ఈ పథకం, దేశ నీలి ఆర్థిక వ్యవస్థకు (Blue Economy) కీలక చోదక శక్తిగా మారింది. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తూ 2026-27 బడ్జెట్లో రికార్డు స్థాయిలో రూ. 2,500 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ. 21,394.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మత్స్య శాఖ ఆమోదం తెలిపింది.
ఈ పథకం సాధించిన ఫలితాలు చేపల ఉత్పత్తి, ఎగుమతుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019-20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి, 2024-25 నాటికి రికార్డు స్థాయిలో 197.75 లక్షల టన్నులకు చేరింది. అదే సమయంలో మత్స్య ఎగుమతులు రూ. 46,663 కోట్ల నుండి రూ. 73,890 కోట్లకు పెరిగాయి. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 58 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించగా, తీరప్రాంతాల్లోని దాదాపు 3 కోట్ల మంది జీవనోపాధికి ఇది కొండంత అండగా నిలుస్తోంది.
ఉత్పత్తి పెంచడంతో పాటు కోల్డ్ చైన్, విక్రయ కేంద్రాల మౌలిక వసతుల కోసం రూ. 2,797 కోట్లు, ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణకు రూ. 3,741.89 కోట్లు ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాకుండా ఆర్ఏఎస్ (RAS), బయోఫ్లాక్, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతలను అందుబాటులోకి తెచ్చింది. చిన్న మత్స్యకారుల బేరసారాల శక్తిని పెంచేందుకు 2,195 మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FFPO) ఏర్పాటు చేయగా, వాతావరణ మార్పులను తట్టుకునే 100 తీరప్రాంత గ్రామాలకు రూ. 2 కోట్ల చొప్పున సహాయాన్ని అందిస్తున్నారు. మత్స్య రంగాన్ని మరింత అధికారికం చేసేందుకు 'జాతీయ మత్స్య డిజిటల్ వేదిక'ను కూడా అందుబాటులోకి తెచ్చారు.