కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని విమర్శలు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై కూటమి పక్షమైన సీపీఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు కేవలం పేరుకే పరిమితమయ్యారని, వారికి ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయని విమర్శించారు.
మంత్రులకు తమ స్వంత శాఖల్లో కనీసం నిధులు (ఫండ్స్) సాంక్షన్ చేసే అధికారం కూడా లేకపోవడం శోచనీయం.
ఏ చిన్న పనికి రూపాయి సాంక్షన్ కావాలన్నా మంత్రులు మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.
నిధుల విడుదల కాకపోవడంతో రాష్ట్రంలో ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని, బిల్లులు వస్తాయో లేదోనన్న అనుమానంతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని స్పష్టం చేశారు. నిధుల గురించి అడిగితే "డబ్బులు లేవు" అని సమాధానం చెప్తున్నారని.. అసలు నిధులే లేనప్పుడు బడ్జెట్లో ఆయా కేటాయింపులు ఎందుకు చూపిస్తున్నారని ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకుని, మంత్రులకు అధికారాలు ఇవ్వడంతో పాటు పెండింగ్ పనులను వేగవంతం చేయడానికి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.