సోన్ నదీ జలాల వివాదానికి తెర
అమిత్ షా సమక్షంలో బీహార్, జార్ఖండ్ చారిత్రాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సోన్ నదీ జలాల పంపిణీ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల ప్రతినిధులు న్యూఢిల్లీలో ఈ రోజు చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు.
ఈ ఒప్పంద కార్యక్రమానికి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ ప్రత్యేకంగా హాజరయ్యారు. కేంద్ర హోం శాఖతో పాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించిన అస్పష్టతలు తొలగిపోయి, నీటి పంపిణీ సజావుగా సాగడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పడనున్నాయి.
సోన్ నదీ జలాల సమర్థవంతమైన నిర్వహణతో ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు, ప్రజలకు తాగు, సాగునీటి ఎద్దడి తప్పుతుందని, ఇది రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సహకారానికి మంచి సంకేతమని కేంద్రం పేర్కొంది.