భారత వృద్ధి పరుగు Q1లో 7.8 శాతానికి చేరిన రియల్ జీడీపీ
న్యూఢిల్లీ: 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1)లో భారత్ 7.8 శాతం వాస్తవ జీడీపీ (Real GDP) వృద్ధి రేటును నమోదు చేసిందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. ఈ గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిరంతర దృఢత్వానికి తార్కాణమని ఆయన వ్యాఖ్యానించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికాలలో కొంత మందగమనం కనిపించినప్పటికీ, ప్రస్తుత Q1 నాటికి వాస్తవ జీడీపీ గణాంకాలు మళ్లీ బలమైన రీతిలో పుంజుకున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశ వృద్ధి పనితీరు స్థిరంగా సాగుతోందని సీఈఏ స్పష్టం చేశారు.పశ్చిమాసియా సంక్షోభం/యుద్ధ వాతావరణం వల్ల ముడిసరుకుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా తయారీ (Manufacturing), సేవా (Services) రంగాలు Q1లో అద్భుతమైన పనితీరును కనబరిచాయి.
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు మూడూ వృద్ధికి దోహదపడినప్పటికీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన సహకారం మాత్రం ఆశించిన దానికంటే కొంత తక్కువగానే ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి అంతర్జాతీయ ఒడుదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత్ త్వరితగతిన వృద్ధి పథంలో పయనిస్తుండటం పట్ల ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.