22A నిషేధిత భూముల జాబితాపై సిద్దిపేటలో బిజెపి ధర్నా
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రామచందర్ రావు
సిద్దిపేట: భూముల '22A నిషేధిత ఆస్తుల జాబితా' చిక్కుల వల్ల సాధారణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO) కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న అసలైన పట్టాదారుల, పేద రైతుల భూములను కూడా రెవెన్యూ శాఖ అధికారులు '22A నిషేధిత జాబితా'లో చేర్చారని బిజెపి నేతలు ఆరోపించారు. తమ సొంత భూములను అమ్ముకోవడానికి లేదా అత్యవసర అవసరాలకు కుదువ పెట్టుకోవడానికి వీలులేకుండా పోయిందని, అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ధ్వజమెత్తారు.
నిషేధిత జాబితా పేరుతో ఇబ్బందులు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి అసలైన యజమానులకు భూములపై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ సమస్యకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, బాధిత రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.