ముగ్గురు భారత రాయబారులతో సీఎం పుష్కర్ సింగ్ ధామి భేటీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ యువతకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక అడుగులు వేశారు. తన అధికారిక నివాసంలో జమైకాలోని భారత హైకమిషనర్ మయాంక్ జోషి, ఇథియోపియాలోని భారత రాయబారి దేవేశ్ ఉత్తమ్, మరియు జాంబియాలోని భారత హైకమిషనర్ అలోక్ రంజన్ ఝాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
జమైకా, ఇథియోపియా, జాంబియాలలో ఉన్న ఉద్యోగావకాశాలు, నైపుణ్యం గల మానవ వనరుల డిమాండ్ మరియు ఉత్తరాఖండ్ యువతకు లభించే అవకాశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. విదేశాల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రంగాలు, అవసరమైన నైపుణ్యాల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించడానికి ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో క్రమం తప్పకుండా టచ్లో ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అంతర్జాతీయ ప్రమాణాలు మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వాలని పిలుపునిచ్చారు. శిక్షణ ద్వారా రాష్ట్ర యువత ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా మెరుగైన కొలువులను సాధించవచ్చని సీఎం ధామి ఆశాభావం వ్యక్తం చేశారు.