యూఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్పై నిషేధం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ:చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద షాజాద్ భట్టి నెట్వర్క్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా హోం మంత్రి వెల్లడించారు.
ఈ నెట్వర్క్ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. యువతను, చిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత కంటెంట్ను వ్యాప్తి చేస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన ఉగ్ర నెట్వర్క్లపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.