CPSEల రుణ అర్హత, నిధుల సేకరణకు క్రెడిట్ రేటింగ్లు కీలకం
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (CPSE) రుణ అర్హతను అంచనా వేయడానికి, పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లకు నిధులను పొందేందుకు క్రెడిట్ రేటింగ్లు ఎంతో కీలకమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (DPE) తెలిపింది. మహారత్న, నవరత్న సంస్థల ప్రతినిధుల కోసం అంతర్జాతీయ, దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలతో కలసి ప్రభుత్వ రంగ సంస్థల స్టాండింగ్ కాన్ఫరెన్స్ (SCOPE) సహకారంతో బుధవారం న్యూఢిల్లీలో వర్క్షాప్ నిర్వహించారు.
ఈ సమావేశంలో డీపీఈ కార్యదర్శి కె. మోసెస్ చాలై మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధిలో సీపీఎస్ఈల పాత్ర కీలకమని, క్రెడిట్ రేటింగ్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. క్రిసిల్, కేర్, ఐసిఆర్ఎ వంటి ప్రముఖ రేటింగ్ సంస్థల సాంకేతిక ప్రజెంటేషన్లతో పాటు పారదర్శక వెల్లడింపులు, మూలధన నిర్మాణ ఆప్టిమైజేషన్పై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఈ జాయింట్ సెక్రటరీ డాక్టర్ వసుంధర ఉపమన్యు, స్కోప్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ సోబ్తితో పాటు 80 మందికి పైగా సీనియర్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు.