మక్కా సమీపంలో డ్రోన్ దాడిని ఖండించిన భారత్
ప్రాంతీయ శాంతికి పిలుపు
న్యూఢిల్లీ:సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను దెబ్బతీసేలా పౌరుల ప్రాణాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిపే ఎలాంటి దాడులైనా ఖండించదగినవని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో త్వరలోనే శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా నగరం అత్యంత పవిత్రమైనదని, అలాంటి ప్రాంత సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళనకరమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్ను మక్కా దక్షిణ ప్రాంతంలో తమ వైమానిక దళాలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలిపింది. పవిత్ర స్థలాలు, యాత్రికుల భద్రత తమకు రెడ్ లైన్ అని సౌదీ సంకీర్ణ దళాలు హెచ్చరించగా.. ఈ ఆరోపణలను హౌతీ తిరుగుబాటుదారులు ఖండించారు. తమ పోరాటం కేవలం సైనిక, చమురు స్థావరాలపైనేనని స్పష్టం చేశారు.