దిగ్గజ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు
న్యూఢిల్లీ:భారతీయ సినిమా రంగానికి చేసిన విశేష సేవలకు గాను ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2024) లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. దశాబ్దాలుగా ఆయన ప్రదర్శించిన సహజ నటన, బహుముఖ ప్రజ్ఞ భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ చిత్రసీమపై చెరగని ముద్ర వేశాయని కొనియాడారు.
ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా స్పందించిన ప్రధాని, అనంత్ నాగ్ తాను పోషించిన ప్రతి పాత్రలోనూ అరుదైన లోతును, వాస్తవికతను తీసుకువచ్చారని పేర్కొన్నారు. నిజమైన విశిష్ట కళాకారుడికి ఇది పూర్తిగా అర్హమైన గౌరవమని అభివర్ణించారు. కాగా, ఈ పురస్కారాన్ని 2026 సెప్టెంబర్ 22న గుజరాత్లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో అనంత్ నాగ్కు అందజేయనున్నారు.