ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని 'సేవా సంకల్ప అభియాన్'
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప అభియాన్' నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రారంభమైన మోదీ ప్రజాసేవ ప్రస్థానం అక్టోబర్ 7, 2026 నాటికి పాతికేళ్లకు చేరుతుందని న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
సాధారణ కార్యకర్త స్థాయి నుండి 'ప్రధాన సేవక్' వరకు ప్రధాని సాగించిన ప్రయాణం, ఆయన హయాంలో సాధించిన ఆర్థిక పురోగతి, డిజిటల్ విప్లవం, 'లఖ్పతి దీదీ' వంటి మహిళా సాధికారత పథకాలు, సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు నక్సలిజం నిర్మూలన వంటి అంశాలను ఈ ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ప్రధాని జన్మదినమైన సెప్టెంబర్ 17న రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అక్టోబర్ 2న స్వచ్ఛతా ఉద్యమం, డిజిటల్ ఫోటో ప్రదర్శనలు, సంక్షేమ పథకాల అవగాహన శిబిరాలను చేపట్టనున్నారు. ఈ జాతీయ ప్రచార కన్వీనర్గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వ్యవహరిస్తారని నబిన్ తెలిపారు.