దేశవ్యాప్తంగా ఎనిమిది ఆపరేషన్లలో 740 కిలోల మాదకద్రవ్యాల స్వాధీనం
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎనిమిది వేర్వేరు ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో 709.6 కిలోల సాధారణ గంజాయి, 24.5 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి మరియు 5 కిలోల చరాస్ ఉన్నట్లు DRI ప్రకటించింది. ఈ దాడులకు సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 కింద 13 మందిని అరెస్టు చేశారు.
రాయ్పూర్ సమీపంలో చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో సుమారు 500 కిలోల గంజాయితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాట్నా సమీపంలో ఒక ట్రక్కును ఛేజ్ చేసి 140.5 కిలోల గంజాయిని, పంజాబ్లోని లూధియానా సమీపంలో వాహనంలో దాచిన 69 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో అమర్నాథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ముగ్గురి వద్ద నేపాల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 కిలోల చరాస్ను అధికారులు పట్టుకున్నారు.
అంతర్జాతీయ మార్గాల్లో జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దాడి చేస్తూ... వియత్నాం, థాయ్లాండ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలకు వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అడ్డగించి 24.6 కిలోల అధిక శక్తివంతమైన గంజాయిని DRI స్వాధీనం చేసుకుంది. రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా జరిగే నార్కోటిక్ నెట్వర్క్లను అంతం చేసేందుకు నిఘా ఆధారిత చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.