BRICS సదస్సు వేళ యూపీ, పొరుగు రాష్ట్రాల శిక్షణా కేంద్రాల్లో విమాన కార్యకలాపాలపై DGCA ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 18వ 'బ్రిక్స్ (BRICS) సదస్సు-2026' దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసేందుకు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్తో పాటు సమీప రాష్ట్రాల్లోని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల (FTO) విమాన కార్యకలాపాలపై మూడు రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 11 ఉదయం 7 గంటల నుండి సెప్టెంబర్ 13 రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయని DGCA తెలిపింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లలోని ఎఫ్టీవోల నుంచి తేలికపాటి, మైక్రో-లైట్ విమానాలు, హ్యాంగ్ గ్లైడర్లు, హెలికాప్టర్లు ఎగరడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వీటితో పాటు ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, యూఏవీలు, మైక్రో-లైట్ విమానాలు, 100 కిలోమీటర్ల పరిధిలో పారా-గ్లైడర్లు, ఏరో-మోడళ్ల కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 11 నుండి 13 వరకు ఈ ప్రతిష్టాత్మక సదస్సు సజావుగా సాగేందుకు అన్ని వర్గాలు సహకరించాలని సీఏఏ అధికారం స్పష్టం చేసింది.