ప్రాథమిక స్థాయిలో సున్నాకి చేరిన డ్రాపౌట్ రేటు
త్రిపుర సీఎం మాణిక్ సాహా
న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్రం విద్యా రంగంలో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో పాఠశాలల నుంచి విద్యార్థులు మానేసే (డ్రాపౌట్) రేటును సున్నా శాతానికి తగ్గించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, 'ఉల్లాస్' (ULLAS) మేళాలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో అక్షరాస్యతను బలోపేతం చేసేందుకు చేపట్టిన వరుస ప్రయత్నాలే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.
గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో నమోదును పెంచేందుకు ఏకలవ్య మోడల్ పాఠశాలల తరహాలో అత్యాధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను త్రిపుర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదని, అది సామాజిక పరివర్తనకు సాధనమని చెప్పారు. 'ఉల్లాస్' కార్యక్రమంలో భాగంగా కొత్తగా అక్షరాస్యత సాధించిన వారికి బ్యాంకింగ్ లావాదేవీలపై ఆర్థిక అక్షరాస్యత, మార్కెట్ కొనుగోళ్ల అనుభవపూర్వక అభ్యాసం, ఆరోగ్యం మరియు పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్య సాధనలో ప్రతీ బిడ్డకు విద్యనందించడమే ప్రధాన ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.