రాష్ట్రపతి, ప్రధానులను కలవనున్న ఆగ ఖాన్ V
ఏడు రోజుల భారత పర్యటన ప్రారంభం
న్యూఢిల్లీ: షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశపారంపర్య ఇమామ్, 'ఆగ ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్' (AKDN) ఛైర్మన్ ప్రిన్స్ రహీం ఆగ ఖాన్ V, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు బుధవారం తన ఏడు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం... ఆయన సెప్టెంబర్ 9 నుండి 15 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మరియు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ప్రిన్స్ రహీం ఆగ ఖాన్ V తన పర్యటనలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్, ముంబై మరియు హైదరాబాద్ నగరాలను సందర్శించనున్నారు. ఇస్మాయిలీ సమాజానికి 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. తన తండ్రి ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ ఆగ ఖాన్ IV మరణానంతరం, ఫిబ్రవరి 2025లో ఆయన ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆధ్యాత్మిక బాధ్యతలతో పాటు, AKDN ద్వారా వివిధ దేశాల్లో సామాజిక, విద్యా మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.