హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు
సూర్య జాతీయ డెస్క్: కులతత్వం, అంటరానితనం అనేవి హిందూ సమాజానికి ఒక పెద్ద మచ్చ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ స్వయంసేవకుల సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. సమాజ సేవ, దేశభక్తి అనేవి కేవలం స్వయంసేవకులకే పరిమితం కాకూడదని, దేశం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నా ప్రతి పౌరుడు ముందుకు వచ్చి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కులం పేరుతో చూపే వివక్ష సమాజాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తుందని, కేవలం చట్టాలు, ఉపన్యాసాలు లేదా దైవిక శక్తుల రాకతో ఈ సమస్య అంతం కాదని, మార్పు అనేది ప్రతి ఒక్కరి ఇల్లు మరియు వ్యక్తిగత ప్రవర్తన నుంచే ప్రారంభం కావాలని తేల్చిచెప్పారు.
ఎలాంటి కుల వివక్షను పాటించబోమని, సమాజంలో అంటరానితనానికి తావులేకుండా చూస్తామని ప్రతి పౌరుడు గట్టి సంకల్పం తీసుకోవాలని హోసబలే పిలుపునిచ్చారు. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం ఏదో ఒక వర్గానికి లేదా తెగకు చెందినవి కావని, అవన్నీ సమష్టి సమస్యలని గుర్తుచేశారు. కులం, మతం, భాష లేదా ప్రాంతం ఆధారంగా తమను తాము వేరుగా భావించడం వల్ల సామాజిక ఐక్యత దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. చేతిలోని నాలుగు వేళ్లు విడివిడిగా ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాయని, అదే పిడికిలిగా మారినప్పుడు అపారమైన శక్తి లభిస్తుందనే ఉదాహరణను ప్రస్తావిస్తూ, జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషించడానికి సమాజం జాగృతమై సమష్టిగా సంఘటితం కావాలని ఉద్ఘాటించారు. వివిధ సామాజిక వర్గాలు, సంఘాల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
దేశభక్తి అనేది కేవలం జనవరి 26 వంటి ప్రత్యేక రోజులకు పరిమితమయ్యే భావన కాదని, అది నిరంతరం కొనసాగే బాధ్యత అని హోసబలే పేర్కొన్నారు. గ్రామ, పట్టణ, ప్రాంతీయ స్థాయిలలో దేశ ప్రయోజనాల కోసం తాము ఏమి చేయగలమో ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఆలోచించాలని, నిస్వార్థంగా రోజుకు కనీసం ఒక గంట పాటు సామాజిక సేవకు కేటాయించాలని కోరారు. సంఘ్ ప్రతిపాదించిన పంచ పరివర్తన్ భావనను వివరిస్తూ సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, పౌర విధులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, నదులను స్వచ్ఛంగా ఉంచడం ద్వారా భవిష్యత్ తరాలకు వనరులను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. దాదాపు ఐదు వేల సంవత్సరాల భారత నాగరికతా ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలు ఎదురైనా దేశం మళ్లీ నిలబడిందని, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యమే సమాజానికి అసలైన బలమని ఆయన స్పష్టం చేశారు.