జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం
కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కురసాల కన్నబాబు పిలుపు
సీతమ్మధార, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల, జీవీఎంసీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే దిశగా నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. మాధవధార వుడా కాలనీలోని గ్రాండ్ మిలాన్ ఫంక్షన్ హాల్లో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజినల్ కో-ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అనంతరం పార్టీ నాయకులకు ఐడీ కార్డులను అందజేశారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ, బాణాల శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ప్రచార విభాగం జోన్-1 అధ్యక్షుడు రవి రాజు, మాజీ కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, కె. అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, మువ్వల పోలారావు, అల్లు శంకరరావు, వావిలపల్లి ప్రసాద్, సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
అలాగే వివిధ వార్డుల అధ్యక్షులు, పరిశీలకులు, రాష్ట్ర, జోనల్, జిల్లా, నియోజకవర్గ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.