స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి
పెనమలూరు, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి దూకిపాటి శశిభూషణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రెండున్నరేళ్లలో పేదలకు ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, మహిళలు, రైతులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించాలని సూచించారు. అనంతరం పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో కార్యకర్తల సమన్వయం, స్థానిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.