34.54 కోట్ల మందికి ‘నషా ముక్త్ భారత్’
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (NMBA) 34.54 కోట్ల మంది పౌరులకు చేరువైంది. ఇందులో 13.70 కోట్ల మంది యువకులు, 10.64 కోట్ల మంది మహిళలు భాగస్వాములయ్యారు. ఈ ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు 31.40 లక్షలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 1.67 లక్షల మంది ‘నషా ముక్తి మిత్రులు’ సేవలందిస్తున్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.
బాధితులకు వైద్య సహాయం అందించేందుకు గత రెండేళ్లలో 755కు పైగా కొత్త వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు సమీపంలోని చికిత్సా కేంద్రాలను గుర్తించేందుకు ‘NMBA 2.0’ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి మరో కోటి మందితో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.