చక్కెర వ్యాపారులకు కేంద్రం బిగ్ షాక్
నిల్వల పరిమితి సగానికి తగ్గింపు.. పడిపోయిన ధరలు!
న్యూఢిల్లీ: పండుగల వేళ చక్కెర అక్రమ నిల్వలు, ఊహాజనిత వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా స్థిరమైన ధరలకు చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు, డీలర్ల నిల్వల పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
డీలర్లు తాము సేకరించిన చక్కెరను స్వీకరించిన తేదీ నుండి 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోకూడదు. దేశవ్యాప్తంగా ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనూ 2,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ ఉంచడం నిషిద్ధం. ప్రాంతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్కతా మరియు దాని మెట్రోపాలిటన్ ప్రాంతాలకు పాత పరిమితి (4,000 క్వింటాళ్లు) కొనసాగుతుంది.
కేంద్ర ప్రభుత్వం మిల్లులు, వ్యాపారుల వద్ద చేపట్టిన భౌతిక తనిఖీలు, పర్యవేక్షణల కారణంగా మార్కెట్లో చక్కెర లభ్యత పెరిగింది. దీంతో ఇటీవల ఎక్స్-మిల్ చక్కెర ధరలు సుమారు 20 శాతం మేర తగ్గాయని, త్వరలోనే రిటైల్ మార్కెట్లోనూ ధరలు మరింత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఆన్లైన్ పోర్టల్లో వ్యాపారులు తమ నిల్వల వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, రాబోయే వారాల్లోనూ భౌతిక తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించింది.