10 నుంచి 12వ తరగతులకు కొత్త ఎన్సిఇఆర్టి (NCERT) పాఠ్యపుస్తకాలు
'మిషన్ మోడ్'లో రూపకల్పన ప్రక్రియ!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యలో కీలక మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 10 నుంచి 12వ తరగతులకు సవరించిన ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాలను 'మిషన్ మోడ్'లో రూపుదిద్దుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం వెల్లడించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
నూతన జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం (NCF) ప్రకారం ఇప్పటికే 1 నుంచి 9వ తరగతుల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 10, 11, 12వ తరగతుల పుస్తకాల సన్నాహాలు వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. మన నిత్య జీవితంలో AI వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, చిన్న వయస్సు నుంచే పిల్లలకు దానిపై అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు AIని బాధ్యతాయుతంగా ఉపయోగించేలా నూతన జాతీయ విద్యా విధానం (NEP) దోహదపడుతుందని వివరించారు.
'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో NCERT కీలక భాగస్వామి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుండగా, భారతదేశంలో యువత ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందన్నారు. భారత మానవ వనరులు దేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక రంగానికే పెద్ద ఆస్తిగా మారనున్నాయని ధీమా వ్యక్తం చేశారు.