ఉల్లి ధరలకు కళ్లెం 'కందా ఎక్స్ప్రెస్', రోడ్డు మార్గంలో బఫర్ నిల్వల పంపిణీ వేగవంతం!
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లి సీజనల్ ధరల పెరుగుదలను అరికట్టడానికి మరియు వినియోగదారులకు తగినంత సరుకు లభ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 'ధరల స్థిరీకరణ నిధి' (PSF) ద్వారా సేకరించిన ఉల్లిపాయల బఫర్ నిల్వలను ప్రధాన వినియోగ కేంద్రాలకు చేర్చేందుకు 'కందా ఎక్స్ప్రెస్' రైలు రేక్లు, రోడ్డు రవాణాతో కూడిన హైబ్రిడ్ నమూనాను విస్తరించింది. నాఫెడ్ (NAFED), ఎన్సిసిఎఫ్ (NCCF) ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ ఎన్సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ అవుట్లెట్లు మరియు మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ. 35 కే అందిస్తున్నారు. ఇప్పటివరకు రిటైల్, బల్క్ మార్కెట్ల ద్వారా 669 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు విక్రయించబడ్డాయి. ఈ చర్యలతో ఢిల్లీ, వారణాసి, అమృత్సర్ తదితర మార్కెట్లలో ధరలు అదుపులోకి వచ్చాయి.
నాసిక్ నుండి రెండు రైళ్లు పంపబడ్డాయి. మొదటిది (450 MT) ఢిల్లీ చేరగా, అందులో నుండి వారణాసి, లక్నో, చండీగఢ్, అమృత్సర్లకు పంపారు. రెండవది (840 MT) చెన్నైకి చేరుకోగా, తమిళనాడు ప్రభుత్వం పిడిఎస్ (PDS) ద్వారా రేషన్ కార్డుకు 1 కిలో చొప్పున అందిస్తోంది. 30కి పైగా ట్రక్కుల ద్వారా సుమారు 1,000 మెట్రిక్ టన్నుల ఉల్లిని రవాణా చేస్తున్నారు. ఢిల్లీ, జైపూర్, జమ్మూ, డెహ్రాడూన్, సిమ్లా, అమృత్సర్, చండీగఢ్, కోల్కతా, గౌహతి, లక్నో, వారణాసి, పాట్నా, భోజ్పూర్, షరీఫ్, భువనేశ్వర్, చెన్నై, మదురై, త్రిస్సూర్ మరియు కొచ్చి నగరాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
వినియోగదారుల ప్రయోజనాలతో పాటు ఉల్లి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బఫర్ నిల్వల సేకరణకు సంబంధించి సుమారు 3,400 మంది రైతులకు నేరుగా రూ. 210 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. అలాగే సరుకు రవాణాలో ఎలాంటి లీకేజీలు, భద్రతా లోపాలు తలెత్తకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.