యుపీని ముంచెత్తిన భారీ వర్షాలు..తీవ్రరూపం దాల్చిన వరదలు
పాఠశాలలు మూసివేత, రైళ్ల రాకపోకలు బంద్!
ఉత్తరప్రదేశ్: మంగళవారం కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ, వారణాసి, చిత్రకూట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీగా నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
మధ్యప్రదేశ్లో కురుస్తున్న వర్షాల వల్ల చిత్రకూట్లో మందాకిని నది ప్రమాద స్థాయి కంటే ఏకంగా నాలుగు మీటర్లు పైగా ప్రవహిస్తోంది. రామ్ఘాట్, నిర్మోహి అఖారా వంటి మతపరమైన ప్రదేశాలు నీట మునిగాయి. గంగా నది నీటిమట్టం గంటకు 0.5 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతూ సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ప్రకారం హెచ్చరిక స్థాయి (70.26 మీటర్లు) దాటి 70.28 మీటర్లకు చేరింది. శారదా నదితో పాటు నేపాల్ సరిహద్దుల్లోని మోహన, కర్నాలి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాలు, దుధ్వా నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.
లఖింపూర్ జిల్లాలో 8వ తరగతి వరకు పాఠశాలలకు ప్రాథమిక విద్యాశాఖ అధికారి ప్రవీణ్ తివారీ సెలవు ప్రకటించారు. శారదా నది ఉప్పొంగడంతో మైలాని-నన్పారా మార్గంలో దాదాపు అరడజను రైళ్లను నిలిపివేశామని ఈఆర్ పీఆర్ఓ మహేష్ గుప్తా తెలిపారు.
వారణాసిలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు నీట మునిగిపోవడంతో సందులు, ఇళ్ల పైకప్పులపైనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీట మునిగిన వీధుల్లో పడవలు ప్రయాణిస్తున్నాయి. చిత్రకూట్లో ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డిఐజి రాజేష్ ఎస్ తెలిపారు. బాధితులకు ఉచితంగా ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నట్లు కమిషనర్ అజిత్ కుమార్ పేర్కొన్నారు.