పశ్చిమ బెంగాల్లో విషాదం.. మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువులు మృతి!
పశ్చిమ బెంగాల్లోని మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వరుస నవజాత శిశువుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆగస్టు ప్రారంభం నుంచి కేవలం మూడు వారాల వ్యవధిలోనే 60 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆసుపత్రి వైద్య సేవలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒక్కరోజే 10 మంది పసికందుల మృతి
ఈ ఘటనలో అత్యంత కలవరపెట్టే విషయం.. ఆగస్టు రెండో వారంలో ఒక్కరోజే 10 మంది నవజాత శిశువులు మృతి చెందడం. ఈ పరిణామాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వరుస మరణాలకు అసలు కారణాలేంటి? వైద్య సేవల్లో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.
60 మందిలో 44 మంది ఇతర ఆసుపత్రుల నుంచి రిఫర్
మృతుల్లో 44 మంది ఇతర ఆసుపత్రుల నుంచి మాల్డా మెడికల్ కాలేజ్కు రిఫర్ అయినవారేనని అధికారులు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో అక్కడ చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వారిని మాల్డాకు తరలించారు. అయితే ఇక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు.
ఒక్కరోజు మరణించిన 10 మంది చిన్నారుల్లోనూ ఇద్దరు మాత్రమే మాల్డా మెడికల్ కాలేజ్లో జన్మించినట్లు సమాచారం. మిగిలిన ఎనిమిది మంది ఇతర ఆసుపత్రుల నుంచి రిఫర్ అయి వచ్చినవారిగా అధికారులు గుర్తించారు.
శ్వాస సమస్యలు.. కామెర్లు.. గుండె జబ్బులు
ప్రాథమిక నివేదికల ప్రకారం.. మృతి చెందిన చిన్నారుల్లో పలువురు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చిన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారణాలతోనే మరణాలు సంభవించాయా? లేక చికిత్సలో లేదా ఆసుపత్రి నిర్వహణలో మరేదైనా లోపం ఉందా? అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.
ప్రభుత్వ దర్యాప్తుతో అసలు కారణాలపై ఉత్కంఠ
వరుస శిశు మరణాల నేపథ్యంలో మాల్డా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అత్యవసర సదుపాయాలు, రిఫరల్ విధానం, చికిత్సలో ఎదురైన సమస్యలపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు నివేదికలో వెలువడే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.