బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే
కర్ణాటక:నేపాల్ను ముంచెత్తిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయని, అక్కడ చిక్కుకున్న భారతీయ పర్యాటకులను, బాధితులను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
గురువారం ఆయన కలబురగిలో మీడియాతో మాట్లాడుతూ నేపాల్ వరద పరిస్థితులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ వరదల్లో కేవలం కర్ణాటకకు చెందినవారే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వెళ్లిన అనేకమంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వందలాది మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, మరికొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. భారత్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు నేపాల్ దర్శనానికి వెళ్తుంటారు. కాబట్టి అక్కడ చిక్కుకుపోయిన మన దేశ పౌరుల కుటుంబాలకు ప్రత్యేక సహాయం అందించడంతో పాటు, నేపాల్ ప్రభుత్వానికి కూడా భారత్ తరఫున సాధ్యమైనంత ఎక్కువ సహాయ సహకారాలు అందించాలి" అని ఆయన కోరారు.
దురదృష్టవశాత్తు నేపాల్లో ఇంతటి భారీ విపత్తు సంభవించిందని, ప్రకృతి విపత్తులను ఎవరూ ఎదిరించలేరని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.