స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి
మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ కమిటీ వేయడంపై బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను కలపాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. "అన్ని విషయాల్లో మీ గురువుగారే ఆదర్శం అంటారు కదా.. అలాంటి ఆంధ్రప్రదేశ్లోనే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో కలపడం పొరపాటని గుర్తించి అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఢిల్లీలో కూడా ఈ ప్రయోగం విఫలమై, వారు కూడా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో విఫలమైన విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చూడటం సరికాదు" అని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని, పాలిటెక్నిక్ విలీనంపై ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.