ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు.. భారత్తో బంధం మరింత బలోపేతం చేయాలని పెజెష్కియన్ పిలుపు!
భారత్తో బంధాన్ని మరింత పెంచుకోవాలని ఇరాన్
భారత్–ఇరాన్ సంబంధాలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిష్కెక్లో జరిగిన SCO సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ఆయన.. భారత్తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత విస్తరించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో సహకారానికి రెడీ
ఇప్పటికే ఉన్న సంబంధాలను కొత్త రంగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని పెజెష్కియన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రవాణా, కనెక్టివిటీ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరాన్ ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.
శాంతి కోసం భారత్ కీలక పాత్ర పోషించాలన్న పెజెష్కియన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెజెష్కియన్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. భారత్కు వివిధ దేశాలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి ప్రాంతంలో యుద్ధం నుంచి చర్చల దిశగా పరిస్థితులను తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యలకు పరిష్కారం సంభాషణ, సహకారంలోనే ఉందని తెలిపారు.
భారత్ది స్పష్టమైన దౌత్య వైఖరి
ప్రధాని మోదీ కూడా భారత్–ఇరాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించి, మరింత వైవిధ్యభరితం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఇంధనం, వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా, సముద్ర రవాణా వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్–ఇరాన్ మధ్య ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ సహకారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.