ఒంటరి మహిళలే టార్గెట్.. అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్
తాండూరు, ఆగస్టు 31 (సూర్య): ఒంటరిగా నివసించే వితంతు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మరల్చి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న అంతర్రాష్ట్ర నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు CCS ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నిందితురాలిని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు.
తాండూరులో 5 కేసులు ఛేదింపు
తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితురాలి ప్రమేయం ఉన్న 5 కేసులను ఛేదించగా సుమారు 9.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ టౌన్ పరిధిలో 2, నవనగర్లో 1 కేసులోనూ ఆమె ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మూడు కేసుల్లో కలిపి 14.5 తులాల బంగారం చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పరిచయం పెంచుకుని దృష్టి మరల్చి..
నిందితురాలు ముందుగా ఒంటరిగా ఉండే మహిళలతో పరిచయం పెంచుకుని మాట్లాడుతున్నట్లు నటించి, వారి దృష్టిని మరల్చి గొలుసులు, నెక్లెస్లు, గాజులు తదితర బంగారు ఆభరణాలను అపహరించేదని పోలీసులు తెలిపారు. ఆమెపై గతంలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో 4, హైదరాబాద్ సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు.
అప్రమత్తంగా ఉండాలి
ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని CCS ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేసుల ఛేదనలో సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ రాజేశ్ మీనా అభినందించారు.