హోర్ముజ్ జలసంధిలో ముదిరిన యుద్ధ మేఘాలు
ఇరాన్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన యూఎస్ 'సెంట్ కామ్'
వాషింగ్టన్:ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్-అమెరికాల మధ్య సైనిక ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలు పాతుతున్న తమ బలగాలపై అమెరికా జరిపిన దాడులను 'దురాక్రమణ చర్య'గా వర్ణిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేసిన ప్రకటనను యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వాదన ముమ్మాటికీ అబద్ధమని తోసిపుచ్చింది.
అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు, పౌర నావికులకు ఐఆర్జీసీ అమర్చుతున్న మందుపాతరల వల్ల తక్షణ ముప్పు ఏర్పడటంతోనే తాము 'పరిమితమైన, కచ్చితమైన దాడి' ద్వారా ఆ ముప్పును నిర్మూలించామని అమెరికా సైన్యం వివరణ ఇచ్చింది. ఇరానే స్వయంగా ఈ ముప్పును సృష్టించిందని విమర్శించింది.
అంతకుముందు, హోర్ముజ్ జలసంధి సమీపంలోని అత్యంత వ్యూహాత్మక లారాక్ ద్వీపంలో ఉన్న ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా రెండు దశల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.
దీనికి ప్రతీకారంగా, జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాలైన కింగ్ హుస్సేన్, అల్-అజ్రాక్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. అయితే, ఈ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని జోర్డాన్ తెలిపింది.
అమెరికా జరిపిన ఈ సైనిక చర్యను ఐఆర్జీసీ ప్రజా సంబంధాల విభాగం అధిపతి హొస్సేన్ మొహెబ్బి తీవ్రంగా నిరసించారు. "ఆర్థిక యుద్ధ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం చేసిన ఈ వ్యూహాత్మక పొరపాటుకు శత్రుదేశం ఆర్థిక, సైనిక రంగాలలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఆయన హెచ్చరించారు.
కాగా, ఇరాన్ ఆర్థిక నెట్వర్క్లను దెబ్బతీసేందుకు అమెరికా ఇటీవలే ప్రకటించిన "ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్" నిర్ణయం తర్వాత ఈ సైనిక దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.