సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
సదాశివపేట: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ తెలిపారు. సోమవారం నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా ఆరోగ్యం, మౌలిక వసతులు, సుందరీకరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, ఎన్.హెచ్-65 బైపాస్ టౌన్ ఎంట్రన్స్ వద్ద భారీ జాతీయ జెండా ఏర్పాటు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు, ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టనున్నారు. వినాయక నిమజ్జనం, దసరా, బతుకమ్మ పండుగలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.మున్సిపాలిటీలో పనిచేస్తున్న 125 మంది పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ఆమోదం తెలిపారు. మరో 105 మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు అందించనున్నారు. పారిశుద్ధ్య పరికరాలు, దోమల నివారణ స్ప్రే మెషిన్లు, అదనంగా ఒక జేసీబీ కొనుగోలుకు కూడా జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.