సౌదీ, హౌతీల మధ్య తీవ్రమైన దాడులు
ఎర్ర సముద్ర మార్గంలో యెమెనీల పలాయనం
రియాద్:మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల నడుమ సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మధ్య సరిహద్దు దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. హజ్జా, తైజ్ ప్రావిన్స్లలో సౌదీ వైమానిక దాడులు జరపగా, సౌదీలోని తైఫ్పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు హోర్ముజ్ జలసంధి గుండా చట్టవిరుద్ధంగా ప్రయాణిస్తున్న టోగో జెండా కలిగిన చమురు ట్యాంకర్పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడులు చేయడంతో ఆ నౌకలో మంటలు చెలరేగాయి.
ఈ తీవ్రస్థాయి పోరాటాల కారణంగా ఎర్ర సముద్రం మీదుగా దాదాపు లక్ష మందికి పైగా యెమెన్ పౌరులు జిబూటి వంటి పొరుగు దేశాలకు పడవల ద్వారా ప్రాణభయంతో పారిపోతున్నారు. అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్యం, గల్ఫ్ చమురు రవాణా మార్గాలకు ఆటంకాలు ఏర్పడటంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల పైనే కొనసాగుతుండగా, అమెరికాలో డీజిల్ ధర గ్యాలన్కు రేకార్డు స్థాయిలో $6.40 కి చేరింది. ఇరాన్పై భారీ వైమానిక దాడులను పునరుద్ధరించాలా వద్దా అనే అంశంపై తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వచ్చే వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ మధ్యప్రాచ్య సంక్షోభం ప్రధాన చర్చనీయాంశం కానుంది.