పోలాండ్లో అమెరికా సైనిక స్థావరం: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్:పోలాండ్లో అమెరికా శాశ్వత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా పురోగతి సాధిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ నాయకత్వంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' వేదికగా పేర్కొన్నారు. అమెరికా, పోలాండ్ మైత్రి కూటమికి ఇది ఒక కీలకమైన ముందడుగు అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఈ ప్రకటనపై పోలాండ్ అధ్యక్షుడు నవ్రోకీ స్పందిస్తూ.. అమెరికా రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, సైనిక స్థావరానికి అత్యుత్తమ స్థానాన్ని కేటాయించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన నాటి నుంచి నాటో తూర్పు సరిహద్దుల్లో బలగాలను పెంచాలని పోలాండ్ కోరుతోంది. ప్రస్తుతం అక్కడ అమెరికా బలగాలు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తుండగా, శాశ్వత స్థావరం ఏర్పాటు వార్తను పోలాండ్ అధ్యక్ష కార్యాలయం చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించింది.