భూటాన్ రాజుతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ
థింఫూ:భారత్-భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్తో గురువారం భేటీ అయ్యారు. థింఫూలో జరిగిన ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ఉన్న విశిష్ట స్నేహబంధాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. అంతకుముందు థింఫూలోని చారిత్రాత్మక 'తాషిచో జోంగ్' వద్ద ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భూటాన్ రాజుతో కలసి విదేశాంగ మంత్రి 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, విదేశాంగ మంత్రి డి.ఎన్. ధుంగ్యేల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా భూటాన్ పురోగతి, సుస్థిర రవాణాకు మద్దతుగా 54 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ వాహనాలను ఆ దేశ ప్రధాని షెరింగ్ టోబ్గేకు జైశంకర్ అందజేశారు. ప్రధాని మోదీ తరఫున భూటాన్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, భూటాన్ అభివృద్ధి మరియు శ్రేయస్సుకు భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇ-మొబిలిటీ రంగంలో భూటాన్ సాధిస్తున్న ప్రగతికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.