అమెరికా, ఇరాన్ల నేరాలపై ఆధారాలు లభ్యం
జెనీవా:ఇరాన్లో జరిగిన సైనిక చర్యలు, అంతర్గత అలవాట్లపై ఐక్యరాజ్యసమితి (UN) వాస్తవ పరిశోధన బృందం సంచలన నివేదికను విడుదలను చేసింది. ఫిబ్రవరిలో ఇరాన్లోని పాఠశాల, క్రీడా ప్రాంగణంపై జరిగిన దాడిలో అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందని, అలాగే ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై విచక్షణారహితంగా విరుచుకుపడిన ఇరాన్ యంత్రాంగం మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడిందని నమ్మడానికి తగిన ఆధారాలు ఉన్నాయని యుఎన్ కమిటీ పేర్కొంది. సోమవారం జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఈ సమగ్ర నివేదికను సమర్పించనున్నారు.
మినాబ్ నగరంలోని ప్రైమరీ పాఠశాలపై జరిగిన దాడిలో 120 మంది పిల్లలతో సహా 150 మందికి పైగా మరణించారని, ఇది తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన యుద్ధ నేరమని నిపుణులు వెల్లడించారు. లామెర్డ్లోని క్రీడా కేంద్రంపైనా అమెరికా దళాలు విచక్షణారహితంగా దాడి చేశాయని నివేదిక తెలిపింది. మరోవైపు గతేడాది డిసెంబర్ నుంచి సాగిన నిరసనల్లో ఇరాన్ ప్రభుత్వం దాదాపు 3,000 మందికి పైగా పౌరులను చట్టవిరుద్ధంగా హత్య చేసిందని, వేలాది మందిని చిత్రహింసలకు గురిచేసిందని యుఎన్ బృందం స్పష్టం చేసింది. అయితే ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు పెంటగాన్ నిరాకరించగా, మానవ హక్కుల మండలి వైఖరిపై వైట్ హౌస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.