కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన
మేడ్చల్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ : పాఠశాల వయస్సు పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న టీడీ టీకా కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. ఆనంద్ పరిశీలించారు. మేడ్చల్ మండలం కిష్టాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన టీకా శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి టీకా పంపిణీ ప్రక్రియను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినుల హాజరు, అర్హుల జాబితా, టీకా రిజిస్టర్, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన విద్యార్థినులందరికీ టీడీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరచడంతో పాటు కోల్డ్చైన్ను సక్రమంగా నిర్వహించాలని, టీకా అనంతరం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.