స్థానిక సమరానికి టీడీపీ సంసిద్ధం..!
స్థానిక సమరానికి టీడీపీ సంసిద్ధం..!
2029పై ఇప్పటి నుంచే గురి..
క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం
ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను స్థానిక ఎన్నికల్లో ఓట్లుగా మలచాలని పార్టీ శ్రేణులకు పిలుపు
కూటమిలో ఎలాంటి గ్యాప్లు ఉండొద్దు.. నేతలంతా సఖ్యతగా సమిష్టిగా పనిచేయాలి
ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు
ప్రతి ఎమ్మెల్యే 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించి.. నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక
డబ్బు ఒక్కటే గెలిపించదు.. ప్రజలు, కేడర్తో బలమైన అనుబంధమే విజయానికి పునాది
2024 కంటే మెరుగైన ఫలితాలే లక్ష్యం.. ముందుగా స్థానిక ఎన్నికల్లో విజయం, ఆపై 2029కు పక్కా పునాది
మూడు నెలలకు ఒకసారి లీడర్షిప్ కాంక్లేవ్ నిర్వహిస్తామన్న సీఎం
లీడర్షిప్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
సూర్య, స్టేట్ బ్యూరో
ప్రభుత్వం పట్ల ప్రజల్లో : ఉన్న సానుకూలతను స్థానిక ఎన్నికల్లో ఓట్లుగా మారేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా నేతలు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా, కూటమి నేతలంతా సఖ్యతగా పనిచేస్తూ, ఎలాంటి గ్యాప్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్లో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, నియోజకవర్గాల అభివృద్ధిపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
నియోజకవర్గానికి రూ.1కోటి చొప్పున కేటాయింపు
డబ్బు ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదని, ప్రజలు, కేడర్తో బలమైన అనుబంధమే విజయానికి పునాది అని సీఎం పేర్కొన్నారు. కేడర్ను నిర్లక్ష్యం చేయకుండా వారిని ఒప్పించి, కలుపుకొని పనిచేస్తే ప్రజాప్రతినిధుల బలం వందరెట్లు పెరుగుతుందని అన్నారు. నియోజకవర్గాల్లో చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కోరగా... ప్రతి నియోజకవర్గానికి రూ.1 కోటి చొప్పున నిధులు అందించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ప్రభుత్వం సమకూర్చే నిధులతో పాటు ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు ఎంపీలు నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి 25 ప్రాధాన్యతాంశాలు
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించి, వాటి ఆధారంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రాధాన్యతా అంశాలపై లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తాయని చెప్పారు. ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యాలతో ముందుకెళ్తోందని తెలిపారు. ప్రజల్లో నిత్యం ఉంటూ, కేడర్తో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సీఎం సూచించారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగేవాడినని, గంటల తరబడి అపాయింట్మెంట్ కోసం వేచి చూసేవాడినని గుర్తుచేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలిపెట్టకుండా పనిచేశామని చెప్పారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నామని వివరించారు. ప్రతి పదేళ్లకోసారి జనరేషన్లో మార్పు వస్తుందని, ఆ మార్పులకు అనుగుణంగా నాయకుల పనితీరు కూడా మారాలని చంద్రబాబు అన్నారు. ఈ తరానికి తగినట్టుగా వ్యవహరించినప్పుడే రాజకీయాల్లో విజయాన్ని సాధించగలమని చెప్పారు. నాయకుల నడవడికను ప్రజలు నిరంతరం గమనిస్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
2029పై ఇప్పటి నుంచే గురి
2029 ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడంపైనే తన ధ్యాస, ఆలోచన ఉందన్నారు. పరిపాలనతో పాటు పార్టీకి కూడా ప్రతిరోజూ సమయం కేటాయిస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుని, ఆ తర్వాతి ఎన్నికలకు మరింత బలమైన పునాది వేసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల ద్వారా పోటీ చేసే అభ్యర్థుల్లో సమర్థవంతమైన మహిళా నాయకులను గుర్తించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలను గెలిపించేలా… కేడర్ తమ కోసం పనిచేసేలా నాయకత్వాన్ని పెంచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను తదుపరి సమావేశాల్లో ప్రదర్శించాలని సూచించారు.