పసుపుమయమైన కోవూరు.. కంచుకోటలో కదం తొక్కిన కార్యకర్తలు
పసుపుమయమైన కోవూరు.. కంచుకోటలో కదం తొక్కిన కార్యకర్తలు
-భారీ ర్యాలీగా తరలివెళ్లి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
-అనంతరం కేడర్ మీటింగ్లో పాల్గొని పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమంపై దిశానిర్దేశం చేసిన యువ నేత
-దశాబ్దాలుగా పసుపు జెండాను మోస్తున్న కార్యకర్తలే కోవూరు టీడీపీకి కొండంత బలం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .
నెల్లూరు బ్యూరో, మేజర్ న్యూస్:
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహావిష్కరణ, కేడర్ మీటింగ్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్బుధవారం కోవూరులో పర్యటించారు. నెల్లూరు నుంచి కోవూరు చేరుకున్న మంత్రి లోకేష్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , యువ నాయకులు, డా.అర్జున్ రెడ్డితో కలిసి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల భారీ జనసందోహం నడుమ దారిపొడవునా ర్యాలీగా తరలివెళ్లి, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేడర్ మీటింగ్లో పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో 100% విజయమే లక్ష్యం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కేడర్ మీటింగులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిర్ణీత సమయానికి కోవూరు కేడర్ మీటింగ్ ప్రారంభం కావాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ నెల్లూరులో జరుగుతున్న బైక్ ర్యాలీని మధ్యలోనే ఆపేసి రావడం ఆయన సమయపాలనకు, క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు. కార్యకర్తలందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. విజయవాడలో జరిగిన లీడర్షిప్ కాన్క్లేవ్ ద్వారా కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతంపై ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, ఇలాంటి సమావేశాలు మూడు నెలలకోసారి నిర్వహిస్తే తమలాంటి కొత్త నాయకులకు ఎంతో ఉపయోగపడతుందని తెలిపారు. 11 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు విజయం సాధించిన కోవూరు గడ్డపై సీనియర్లు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తే అధినేత అని చూపిస్తున్నాం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రు మాట్లాడుతూ, 1980ల నాటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పసుపు జెండాను మోస్తున్న నిబద్ధత కలిగిన కార్యకర్తలే కోవూరులో టీడీపీకి బలమని కొనియాడారు. వారసత్వం అంటే కేవలం ఆస్తులు కాదని, తాతలు, తండ్రుల ఆశయాలను నిలబెట్టడమని లోకేష్ నిరూపించారని తెలిపారు. రూ.100 కే ఇన్సూరెన్స్, న్యూట్రిపుల్, గ్రీవెన్స్ వంటి సేవలతో పాటు ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, బసవతారకం ఆస్పత్రి ద్వారా వేలాది మందికి సేవలు అందిస్తున్నారని వివరించారు. ఐటీ మంత్రిగా విశాఖకు గూగుల్ డేటా సెంటర్తో పాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలను తీసుకురావడం ఆయన సమర్థతకు నిదర్శనమన్నారు. గత పాలకులు ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టి అవమానిస్తే, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉపాధ్యాయ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీలపై కనీస అవగాహన లేని ప్రతిపక్షాలు మెగా డీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు , నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూఖ్ , నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు