|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 07:45 PM
పిల్లల భద్రత, మహిళా రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హైదరాబాద్లో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మాసూమ్ సమ్మిట్' 10వ వార్షికోత్సవానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లలు మన భవిష్యత్తు అని.. వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ అని మంత్రి తెలిపారు. ఈ నెల 22వ తేదీన మహిళా భద్రతపై మేధావులు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సదస్సును నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వారు ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించారు. పిల్లల రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ అని తెలిపారు. పసితనంలో ఉన్నపుడు వారి మనసుల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఒక చిన్నారి గాయపడితే ఆ గాయం వారిని జీవితాంతం వెంటాడుతుందని వెల్లడించారు. అందుకే పిల్లలు నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే వాతావరణం కల్పించడం సమాజం బాధ్యత అని తెలిపారు.
రాష్ట్రంలోని చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహిస్తుందని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు మరింత పౌష్టికాహారం అందించేందుకు పరిశోధనలు చేసి మెనూలో మార్పులు చేసినట్లు మంత్రి సీతక్క వివరించారు. లైంగిక నేరాల నివారణకు కేవలం చట్టపరమైన శిక్షలు మాత్రమే కాకుండా.. ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా అవసరమని సీతక్కు గుర్తు చేశారు. సమాజంలో ఆడవారిని ఎలా గౌరవించాలో స్కూల్లలోనే నేర్పాలని ఆమె సూచించారు. ఇళ్లు, పాఠశాలలు, గ్రామాల్లో 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' వంటి అంశాలపై చర్చ జరగాలని.. పిల్లలు ధైర్యంగా తమ మనసులో ఉన్న మాటలను మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
అలాగే రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు.. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీస్ శాఖలో ప్రత్యేక నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడం ద్వారానే రాష్ట్రంలో చిన్నారుల భద్రతను మరింత పెంపొందించవచ్చని మంత్రి సీతక్క వెల్లడించారు.
మహిళల ప్రగతితోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు నిజమని తెలిపారు. స్కూళ్లలోనే అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిస్తున్నామని వివరించారు. గత 10 ఏళ్లుగా మాసూమ్ సమ్మిట్ చేస్తున్న కృషిని అభినందించిన మంత్రి సీతక్క.. ప్రభుత్వం అందరితో కలిసి పనిచేసి.. ప్రతి చిన్నారి సమాజంలో భయపడకుండా జీవించే వాతావరణాన్ని కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.