స్కూల్ విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. దసరా సెలవులు ఎప్పుడంటే?
తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మొదటి విడత సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనుండగా, ఆ వెంటనే అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు.
పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక షెడ్యూల్ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మొదటి విడత సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను అధికారికంగా వెల్లడించారు. ఈ అకడమిక్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎస్ఏ-1 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
విద్యార్థుల తరగతుల వారీగా పరీక్ష సమయాల్లో మార్పులు చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం వేర్వేరు సమయాల్లో పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే 6 మరియు 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షా సమయం కేటాయించారు.
మరోవైపు ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా పరీక్ష వేళలు ఖరారయ్యాయి. 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష ఉంటుందనే పూర్తి వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్ పట్టికను అధికారులు అందుబాటులో ఉంచారు.
పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు దసరా పండుగ సెలవులు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. పరీక్షల ఒత్తిడి నుంచి విద్యార్థులకు విరామం లభించడంతో పాటు, పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఈ సెలవులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.