అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ సెకండ్ సాంగ్ విడుదల.. అక్టోబర్ 9న థియేటర్లోకి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘వెవెలా ఊహలే చూపినా..’ అంటూ సాగే రెండో పాటను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయగా, అక్టోబర్ 9న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వైవిధ్యమైన కాన్సెప్ట్తో వస్తున్న తాజా చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పూర్తిగా మేఘాలయా రాష్ట్రంలోనే చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావడం విశేషం. ముఖ్యంగా చిరపుంజి వంటి అందమైన ప్రాంతాలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ తో పాటు ‘ఆజా మేరీ జాని’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని సెకండ్ సింగిల్ ‘వెవెలా ఊహలే చూపినా..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి ఈ పాటను లాంచ్ చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పాటకు సంబంధించిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కథ ప్రకారం ఒక అరుదైన బాక్స్ కోసం విలన్ గ్యాంగ్ అన్వేషిస్తుండగా, అది హీరో హీరోయిన్ల వద్ద ఉందని భావించి వారిని వెంబడిస్తుంది. ఈ క్రమంలో ఊహించని విధంగా హీరో చేతిలోని గన్ పేలడంతో విలన్లు రివర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ యాక్షన్ సన్నివేశాల నడుమ రేట్రో స్టైల్లో ఈ గీతం అలరిస్తుంది.
ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతం అందించగా, కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు చక్కని సాహిత్యాన్ని అందించారు. శ్రీ సాగర్ తనాత్రత గల స్వరాంజలితో ఈ పాటను ఆలపించారు. డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగింపు దశకు తెచ్చిన చిత్ర యూనిట్, అక్టోబర్ 9న సినిమాను భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.