తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డులు
పంపిణీ నిలిపివేసిన అధికారులు!
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత (స్మార్ట్ రేషన్) కార్డుల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, సమన్వయ లోపం వెలుగుచూశాయి. సిబ్బంది బాధ్యతారాహిత్యంతో కార్డులపై గ్రామ పేర్లు, వివరాలు తప్పులతడకగా ముద్రించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా కార్డుల పంపిణీని తక్షణమే నిలిపివేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మొదటి విడతగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, కార్డులను క్షేత్రస్థాయి పరిశీలించకుండానే ముద్రించడంతో భారీ పొరపాట్లు దొర్లాయి.
హరిపురం గ్రామంలో కార్డులు పంపిణీ చేస్తుండగా గ్రామం పేరు ‘ఓదెల’గా ముద్రించి ఉంది. రాయగూడెం పంచాయతీకి చెందిన కార్డులపై ‘బుద్దారం’ అని, మోటాపురం గ్రామ కార్డులపై ‘రాజేశ్వరపురం’ అని ముద్రించారు.పలు గ్రామాలకు చెందిన పోస్టల్ పిన్ కోడ్ నంబర్లు కూడా పూర్తిగా తప్పుగా రాశారు.
అధికారులు అందించిన కార్డుల్లో తమ ఊరి పేర్లు, పిన్ కోడ్లు తప్పుగా ఉండటంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ తప్పుల వల్ల ప్రభుత్వ పథకాలు అందవేమోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి, కార్డుల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
తప్పులను సరిచేసి, కొత్తగా సవరించిన కార్డులను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.