కంగనా-తాప్సీ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? తాప్సీ క్లారిటీ.. మీడియాపైనే అసహనం
- కంగనా రనౌత్తో వివాదం కొనసాగడానికి మీడియానే కారణమన్న తాప్సీ
- ఇద్దరినీ పదేపదే ప్రశ్నించడం ఆపితే గొడవ ముగిసిపోతుందని వ్యాఖ్య
- ఇటీవల తాప్సీ పెంపకంపై కంగనా తీవ్ర విమర్శలు
- తాప్సీని ‘సస్తీ కాపీ’ అంటూ కంగనా ఘాటు వ్యాఖ్యలు
- ‘గాంధారి’ ట్రైలర్ లాంచ్లో వివాదంపై స్పందించిన తాప్సీ
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతుండగా.. తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమ మధ్య వివాదం ఇంకా కొనసాగడానికి మీడియా ప్రశ్నలే కారణమని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గాంధారి’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా కంగనాతో ఉన్న వివాదంపై ఓ విలేకరి ప్రశ్నించగా.. తాప్సీ ఘాటుగా స్పందించారు.
“ఈ విషయాన్ని మీరెందుకు ముగియనివ్వరు? మా ఇద్దరినీ ఈ అంశంపై ప్రశ్నించడం ఆపినప్పుడే ఈ వివాదం ముగుస్తుంది. మీరు పదేపదే అవే ప్రశ్నలు అడుగుతున్నారు. బహుశా ఈ వివాదాన్ని చూడటం మీకు ఆసక్తిగా అనిపిస్తుండొచ్చు. మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఆపేస్తే ఈ గొడవ ఎప్పుడో ముగిసిపోయేది” అని తాప్సీ వ్యాఖ్యానించారు.
పెంపకంపై మొదలైన మాటల యుద్ధం
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ.. కంగనా మాట్లాడే విధానం ఆమె పెంపకాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించారు. తాప్సీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆమెను ‘సస్తీ కాపీ’ అంటూ సోషల్ మీడియాలో విమర్శించారు.
తన తల్లిదండ్రులు, వారి పెంపకాన్ని ప్రశ్నించే స్థాయికి తాప్సీ దిగజారారని కంగనా మండిపడ్డారు. తాను రాజ్పుత్ జమీందార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. అయితే కంగనా చేసిన ఆ పోస్ట్ను ఆ తర్వాత తొలగించారు.
2019 నుంచే కొనసాగుతున్న వివాదం
కంగనా, తాప్సీ మధ్య విభేదాలు కొత్తవి కావు. 2019లో కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో తాప్సీని ‘సస్తీ కాపీ’గా అభివర్ణించడంతో ఈ వివాదం మరింత బహిరంగమైంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఒక సందర్భంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
తాజాగా ‘గాంధారి’ ప్రమోషన్లో తాప్సీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ పాత వివాదం తెరపైకి వచ్చింది. అయితే మీడియా ప్రశ్నలు ఆగితేనే ఈ అంశానికి ముగింపు వస్తుందని తాప్సీ స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.