ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి
ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి.
సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ నోటీసుల పంపిణీ పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. నోటీసులు అందజేసిన అనంతరం తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ పొందాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షించారు. పెండింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, మిగిలిన నోటీసుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఇబ్బంది కలగకుండా, ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.