ఖబర్ధార్ శంకర్.!
తెలంగాణ జాతిపిత కేసీఆర్ను అవమానిస్తే సహించేది లేదు
- షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దగ్ధం
రంగారెడ్డి/షాద్ నగర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 08) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాది తెలంగాణ ప్రజలను ఏకం చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ షాద్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ను అవమానించేలా మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయాలంటే విధానాలు, పాలనపై చేయాలని, వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ చేసిన కృషిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు. కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.