విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము
విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము
ట్రాన్స్ కో హుజూరాబాద్ 132/11 సబ్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతిచెందిన గ్రేడ్ -2 ఉద్యోగి శంకర్ రెడ్డి సతీమణి బోడ స్వాతికి మంగళవారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందించారు. హుజూరాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శంకర్ రెడ్డి 2025 అక్టోబర్ 1న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బోడ స్వాతికి రూ.కోటి ప్రమాద బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగాఅందించారు. ఈ సందర్భంగా బోడ స్వాతితో మాట్లాడుతూ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువులు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ బీమా సొమ్ముతో పిల్లలను బాగా చదివించాలని చెప్పారు.
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న రూ.కోటి ప్రమాద బీమా పథకం మొదట సింగరేణి సంస్థలో ప్రారంభమై, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో అమలవుతోంది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే ఈ ప్రమాద బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ట్రాన్స్కో అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.