గ్లోబల్ సౌత్కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ప్రపంచ నిర్ణయాధికార ప్రక్రియలో 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న దేశాల) పాత్రను మరింత పెంచాలని మరియు బహుపాక్షిక వ్యవస్థలో సమ్మిళితత్వాన్ని తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగమైన "సమ్మిళిత ప్రపంచ పాలన మరియు బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం" అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల్లో ముందు వరుసలో ఉంటున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే వేదికలపై మాత్రం వెనుక వరుసలోనే మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత "విశేషాధికారాల పిరమిడ్"ను తొలగించి "భాగస్వామ్య వేదిక"గా మార్చాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ సౌత్ కేవలం 'నియమాలను పాటించే' స్థాయి నుండి 'నియమాలను రూపొందించే' స్థాయికి ఎదగాలని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని స్పష్టం చేశారు.
అలాగే ప్రపంచ వాణిజ్యానికి ఎనలేని సేవలు అందిస్తున్న సముద్రయాన సిబ్బంది రక్షణ కోసం 'సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్' ను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. బ్రిక్స్ ఉమ్మడి ప్రాధాన్యతలు, భవిష్యత్ దిశానిర్దేశం చేసే 'న్యూఢిల్లీ ప్రకటన' ఆమోదంతో ఈ సమావేశం ముగిసింది.