స్వదేశీకరణ, ప్రపంచ పోటీతత్వమే లక్ష్యం
డీపీఎస్యూల (DPSU) పనితీరుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష!
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తిని విస్తరించడం, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో 16 రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థల (DPSU) వార్షిక పనితీరును సమీక్షించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి సంజీవ్ కుమార్ మరియు వివిధ సంస్థల సీఎండీలు పాల్గొన్న ఈ సమావేశంలో స్వదేశీ తయారీ, ఎగుమతులు, ఆర్ అండ్ డి (R&D) మరియు సరఫరా గొలుసు పటిష్టతపై విస్తృతంగా చర్చించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సాధించిన మొత్తం రూ. 1.8 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తిలో డీపీఎస్యూల వాటా ఏకంగా రూ. 1.29 లక్షల కోట్లుగా ఉందని రక్షణ మంత్రి వెల్లడించారు. 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' మంత్రంతో మన డీపీఎస్యూలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదగాలని, అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలను అందుకోవాలని పిలుపునిచ్చారు.
హెచ్ఏఎల్ (HAL), బీఈఎల్ (BEL), ఎండీఎల్ (MDL), బీడీఎల్ (BDL) సహా ఏడు కీలక డీపీఎస్యూల సీఎండీలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,951 కోట్ల డివిడెండ్ చెక్కులను రాజ్నాథ్ సింగ్కు అందజేశారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, ఆవిష్కరణలను ప్రతిబింబించేలా రాజ్నాథ్ సింగ్ నాలుగు పుస్తకాలను విడుదల చేశారు:
రాబోయే ఐదేళ్లలో చేపట్టబోయే స్వదేశీకరణ ప్రక్రియలు, ఉత్పత్తుల వివరాలు. పరిశ్రమలు-విద్యార్థుల మధ్య సహకారాన్ని పెంచి, రక్షణ సాంకేతికతపై యువతకు అవగాహన కల్పించే కార్యక్రమం. హెచ్ఏఎల్ను భవిష్యత్తు ఏరోస్పేస్ దిగ్గజంగా తీర్చిదిద్దే ప్రణాళిక. ఏరో, డిఫెన్స్ విభాగాల్లో స్వయంసమృద్ధికి నాంది.
ఇటీవలి ప్రపంచ యుద్ధాలు, ఘర్షణలు బలాన్ని నిరూపించాయని, స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ అనేది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదని, జాతీయ భద్రతకు అత్యంత ఆవశ్యకమని ఈ సందర్భంగా రక్షణ మంత్రి నొక్కి చెప్పారు.