భారతదేశ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్కు భారీ స్పందన
రూ. 37,500 కోట్ల పథకం మొదటి విడతలో 7 దరఖాస్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 37,500 కోట్ల 'ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్' పథకం మొదటి విడతకు పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి విడత దరఖాస్తుల గడువు ముగిసేసరికి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి మొత్తం ఏడు ప్రతిపాదనలు వచ్చినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ పథకం కింద అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టిపిసి (NTPC), తాల్చేర్ ఫెర్టిలైజర్స్, గ్యాలంట్ ఇస్పాట్, శ్యామ్ సెల్ & పవర్ వంటి దిగ్గజ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ యూరియా ప్రాజెక్టుల కోసం మూడు వేర్వేరు దరఖాస్తులను సమర్పించగా, తాల్చేర్ ఫెర్టిలైజర్స్ యూరియా ప్రాజెక్టు కోసం, గ్యాలంట్ ఇస్పాట్ డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ మరియు సింగాస్ ప్రాజెక్టు కోసం, ఎన్టిపిసి సింథటిక్ నేచురల్ గ్యాస్ తయారీ కోసం, శ్యామ్ సెల్ & పవర్ సింగాస్ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలు అందజేశాయి.
ఈ సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. పథకంపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్న వార్తలను ఖండిస్తూ, పరిశ్రమ నిర్ణయాత్మకంగా స్పందించిందని, ఈ దరఖాస్తులే భారత బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్పై పరిశ్రమకు ఉన్న నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనమని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రివర్గం మే 2026లో ఆమోదించిన ఈ రూ. 37,500 కోట్ల పథకం ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలన్న భారత లక్ష్యంలో.. ఈ కొత్త పథకం కిందే 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని నిర్దేశించారు.
బొగ్గు లేదా లిగ్నైట్ను సింథటిక్ గ్యాస్గా (సింగాస్) మార్చడం ద్వారా యూరియా, మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్, సింథటిక్ నేచురల్ గ్యాస్ వంటి విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తుల దిగుమతుల కోసం భారతదేశం ఏకంగా రూ. 2.77 లక్షల కోట్లు వెచ్చించింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దిగుమతుల భారం గణనీయంగా తగ్గడమే కాకుండా దేశీయంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కాగా, మొదటి విడతలో వచ్చిన ఏడు దరఖాస్తుల మూల్యాంకనం ప్రస్తుతం జరుగుతుండగా, సెప్టెంబర్ 8వ తేదీ నుంచి రెండవ విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రతీ రెండు నెలలకోసారి కొత్త విడత దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది.