కుటుంబంతో కలిసి ‘ఎపిక్’ చూడొచ్చు.. కడలి పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: హీరోయిన్ వైష్ణవి చైతన్య
టాలీవుడ్లో క్యూట్ జోడీగా పేరు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న తాజా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్తో ప్రేక్షకులను కట్టిపడేసిన యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక వైష్ణవి చైతన్య సినిమా విశేషాలను పంచుకున్నారు.
షార్ట్ ఫిలిమ్స్ ప్రయాణం నుంచి నేడు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంపై స్పందిస్తూ, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, పరిశ్రమ పెద్దలు, ప్రేక్షకుల ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో రాణిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. 'బేబీ' తర్వాత మళ్లీ ఆనంద్తో కలిసి నటిస్తుండటంపై స్పందిస్తూ, ఆ సినిమాకు, దీనికి ఎలాంటి పోలిక ఉండదని, ఒక సవాల్గా తీసుకుని ఈ ప్రాజెక్ట్ చేశామని వెల్లడించారు. ఈ చిత్రంలో తాను పోషించిన 'కడలి' పాత్ర చాలా బలంగా ఉంటుందని, తన కోసం తాను నిలబడే ఆ స్వభావం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమాజం, కుటుంబం కారణంగా లోపలికిపోయిన ఆ వ్యక్తిత్వాన్ని ఈ పాత్ర కళ్లకు కడుతుందని తెలిపారు.
దర్శకుడు ఆదిత్య హాసన్ పనితీరును కొనియాడుతూ, ఆయన జీవితంలోని చిన్న చిన్న అంశాలను కూడా లోతుగా గమనించి తెరపై ఎమోషనల్ టచ్తో చూపించడంలో దిట్ట అని చెప్పారు. భిన్న ధృవాల లాంటి ఇద్దరు యువతీయువకులు యూకేలో కలుసుకోవడం, లివ్-ఇన్ రిలేషన్షిప్లో వారి మధ్య నడిచే సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని తెలిపారు. బోల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ, కుటుంబ సమేతంగా వచ్చి హాయిగా సినిమా చూడొచ్చని, ఎలాంటి ఇబ్బందికర సన్నివేశాలు ఉండవని స్పష్టం చేశారు. సితార బ్యానర్లో హీరోయిన్గా మారడం తన పెద్ద కల నిజమవడమేనని చెప్పిన వైష్ణవి, ప్రస్తుతం నితిన్తో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.